కనకధారా స్తోత్రం — ఆది శంకరాచార్యులు రచించిన, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తించే ప్రసిద్ధ స్తోత్రం. మొత్తం 25 శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని కోట్లాది మంది భక్తుల విశ్వాసం.
ఆవిర్భావ గాథ: ఒకసారి శంకరాచార్యులు భిక్షకు వెళ్ళినప్పుడు, ఆ ఇంటి పేద ఇల్లాలికి ఇవ్వడానికి ఆహారం ఏమీ లేక, ఇంటిల్లిపాదీ వెతికి ఒక్క ఉసిరికాయను మాత్రమే కనుగొని ఆయనకు సమర్పించింది. ఆమె పేదరికాన్ని చూసి కరుణించిన శంకరులు అక్కడికక్కడే లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో ప్రార్థించగా, ఆ ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం (కనక-ధార) కురిసిందని పురాణ గాథ. ఈ గాథ గురించి మా ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర పేజీలో మరింత చదువుకోవచ్చు.